హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉన్నది. మార్చి 1న నామినేషన్ల పరిశీలన, మార్చి 5న ఉపసంహరణ, మార్చి 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అదేరోజు సాయం త్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కోడ్ వర్తించదని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్కుమార్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో టీచర్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఈవో రజత్కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్ల తుదిజాబితా పూర్తి అయిందన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,90,994 మంది ఓటర్లున్నారన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ నియోజకవర్గంలో 22,487, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 20,585 మంది ఓటర్లున్నారని వివరించారు.