జనగామ : విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు ఈనెల 21న (నేడు) జనగామ రైల్వేస్టేషన్లో హాల్టింగ్ ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం విజయవాడ నుంచి బయలుదేరే శాతవాహన రైలు ఉదయం 10.15గంటలకు జనగామకు చేరుకొని ఉదయం 10.16కు సికింద్రాబాద్ పైపుకు బయలుదేరుతుంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి జనగామకు సాయంత్రం 5.15గంటలకు చేరుకొని 5.16కు విజయవాడ వైపు బయలుదేరుతుంది. జనగామ స్టేషన్లో కేవలం ఒక్క నిమిషం మాత్రమే హాల్టింగ్ ఇవ్వడంతోపాటు అప్ అండ్ డౌన్లో వచ్చే ఆదాయాన్ని ఆరునెలల పాటు ప్రయోగాత్మకంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. జనగామలో శాతవాహన, శిరిడీ, ఛార్మినార్, దానాపూర్ వంటి పలు ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని, కోచ్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు ఎంతోకాలంగా కోరుతున్నారు. ఇటీవల మోడ్రన్ మరుగుదొడ్ల ప్రారంభోత్సవం సందర్భంగా రైళ్ల హాల్టింగ్, కోచ్డిస్ప్లే వంటి అంశాలపై స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపీ నర్సయ్యగౌడ్ లు రైల్వే ఏడీఆర్ఎంను కోరారు. దీనిపై స్పందించిన ఎంపీ త్వరలో శాతవాహన హాల్టింగ్ ఉంటుందని ప్రకటించారు. కాగా, జనగామ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు కృషి చేసిన భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 10గంటలకు జనగామ స్టేషన్లో శాతవాహన హాల్టింగ్కు పచ్చజెండా ఊపి స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు.