న్యూఢిల్లీ: రాఫెల్ డీల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని ఇటీవల సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తీర్పును సమీక్షించాలని వేసిన పిటిషన్లను రేపు స్వీకరించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్.. ఈ పిటిషన్ వేశారు. సీల్డ్ కవర్లో రాఫెల్ డీల్పై తప్పుడు సమాచారం అందించారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. డసాల్ట్ కంపెనీ వద్ద 36 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ డీల్లో భారీ కుంభకోణం జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అయితే ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్రం సుప్రీంకు ఇటీవల తన నివేదికను సీల్డ్ కవర్లో అందజేసింది. దానిపై సుప్రీంకోర్టు కూడా విచారణ అవసరం లేదని వెల్లడించింది. అయితే తాజాగా ఓ ఆంగ్ల పత్రిక కొన్ని రహస్య వాస్తవాలు వెల్లడించడంతో.. తన తీర్పుపై సమీక్ష పిటీషన్లు స్వీకరించినట్లు సుప్రీం పేర్కొన్నది. భిన్నమైన జడ్జీలతో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, పిటీషన్లపై విచారణ చేపడుతామని ఇవాళ చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ తెలిపారు.