ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను నమ్మిస్తారు. ఎస్బీఐ, రైల్వే, ఆదాయపన్ను విభాగంలో కొలువులు ఇప్పిస్తామని ఊదరగొడతారు. శిక్షణ పేరిట వారికి క్లాసులూ నిర్వహించి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇస్తారు. ఇలా ఒక్కొక్కరి నుంచి 10-15 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి 4కోట్ల రూపాయలకు పైగా కాజేశారు. చివరకు వారి పాపం పండింది. నిరుద్యోగుల ఉసురు వారికి తగిలింది. అంతే 11మందితో కూడిన ఓ అంతర్రాష్ట్ర ముఠా దందాను రాచకొండ పోలీసులు రట్టు చేశారు. పదకొండు మందిలో పాటు ప్రధాన నిందితుడు ఒడిసాకు చెందిన కాలు చరణ్ పండా. ఇతడికి అజయ్, మనోజ్, కరణ్ అనే పేర్లూ ఉన్నాయి. ఐదేళ్ల క్రితం కోల్కతాకు బతుకుదెరువు కోసం వెళ్లాడు. జల్సాలకు మరిగాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో స్నేహితులతో ముఠా ఏర్పరచుకున్నాడు. ఒడిసా, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని కొన్ని జాబ్ కన్సల్టెన్సీలతో సంబంధాలను ఏర్పాటు చేసుకొని, నిరుద్యోగుల ఫోన్ నంబర్లను సేకరించాడు. స్నేహితుల ద్వారా నిరుద్యోగులకు ఫోన్ చేసి, తమ కన్సల్టెన్సీ ద్వారా కచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని, ట్రైనింగ్ కూడా తామే ఇస్తామని నమ్మించాడు. హైదరాబాద్లోని ఒక కన్సల్టెన్సీలో పనిచేస్తున్న చింతకింది శ్రీకాంత్, ఏపీలోని గుంటూరుకు చెందిన కడియాల సంధ్యారాణిలతో పరిచయం పెంచుకొని కమీషన్ కింద తన ముఠాలో చేర్చుకున్నాడు.
నిరుద్యోగులు ఆ లెటర్ తీసుకొని ఎస్బీఐ, రైల్వే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్లలో ఉద్యోగం కోసం వెళితే అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. దాంతో మోసపోయామని తెలుసుకున్న కేతావత్ మోహన్ నాయక్, బానోతు మోహన్, కిషన్, రమేశ్ అనే నిరుద్యోగులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. సీపీ భగవత్, రాచకొండ స్పెషల్(ఎస్ వోటీ ) పోలీసులను రంగంలోకి దింపారు. ఎస్వోటీ ఏడీసీపీ సురేందర్ రెడ్డి పర్యవేక్షణలో మల్కాజ్గిరి ఎస్వోటి ఇన్స్పెక్టర్ నవీన్కుమార్, రవిబాబు, ఉప్పల్ పోలీసులు తన సిబ్బందితో రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలు సేకరించి, కోల్కతాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలో నలుగురు చరణ్ పండా, మురళీకృష్ణ, వీరరాఘవరెడ్డి, సంధ్యారాణిలను అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాంత్, సంధ్యారాణి, తన మిత్రులు కాలినాథ్ రాయ్, హేమంత్, అనిల్, రాజీవ్ కార్తీక్, పానుగంటి వెంకటేశ్, అశోక్రావు, అలోక్ వర్మా, రమా ప్రసన్ని, వీరరాఘవరెడ్డి, మురళీకృష్ణ సహకారంతో 100మందికి పైగా నిరుద్యోగులను ఆకర్షించారు. కేటుగాళ్లను నమ్మిన చాలామంది నిరుద్యోగులు కోల్కతాలో శిక్షణకు హాజరయ్యారు. ఈ బాధ్యతను మురళీకృష్ణ చూశాడు. ముఠాలోని కొందరిని బ్యాంకు, రైల్వే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్లలో ఉన్నతోద్యోగులుగా పరిచయం చేసేవారు వారి ద్వారానే తమకు ఉద్యోగాలు వస్తున్నాయని నమ్మించేవారు. శిక్షణ ముగిసిందని చెప్పి, వారికి వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేవారు. పదిరోజుల్లో వెళ్లి ఉద్యోగంలో చేరాల్సిందిగా నమ్మించి కోల్కతా నుంచి పంపేశారు.