న్యూఢిల్లీ : మెట్రో ట్రాక్పై ఓ ప్రయాణికుడు పడిపోయాడు. ఈ సంఘటన ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ స్టేషన్లో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. కేంద్ర జౌళిశాఖలో ఉద్యోగిగా పని చేస్తున్న జఖారియా కోషే(57) తన భార్యతో కలిసి మెట్రో రైలు కోసం దిల్షాద్ గార్డెన్ స్టేషన్లో ఎదురుచూస్తున్నాడు. రైలు స్టేషన్లోకి వస్తున్న సమయంలోనే పట్టాలపై పడిపోయినట్లు అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికుడి కుడి పాదం పూర్తిగా తెగిపోయింది. ఎడమ పాదానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే బాధిత వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.