ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మారిన కేసీఆర్ వ్యూహాం... కాంగ్రెస్ బాటలో

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 10:59 AM

టీఆర్ఎస్ తరపున ఒకరిద్దరు మినహా సిట్టింగ్ ఎంపీలందరికీ టికెట్లు గ్యారంటీ అని ఇటీవల పార్టీ సమావేశాల్లో వ్యాఖ్యానించిన పార్టీ చీఫ్ కేసీఆర్... ఇప్పుడు వ్యూహం మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో వార్ వన్ సైడ్‌గా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్న టీఆర్ఎస్... కాంగ్రెస్ తరపున సీనియర్ నాయకులు బరిలోకి దిగితే మాత్రం పరిస్థితిలో కొంతమేర మార్పు ఉండవచ్చనే అభిప్రాయానికి వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అంతకుముందు కాంగ్రెస్ తరపున పెద్దగా గుర్తింపు లేని నాయకులే ఎక్కువగా లోక్ సభ ఎన్నికల రేసులో ఉంటారనే ప్రచారం జరిగింది.


అయితే పార్లమెంట్ ఎన్నికల రేసులో సీనియర్లందరినీ బరిలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గెలుపోటములతో సంబంధం లేకుండా టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాల్సిందే అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తుండటంతో... టీపీసీసీ ఇచ్చిన జాబితాను పక్కనపెట్టి కాంగ్రెస్ హైకమాండ్ సొంతంగా లిస్టు తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. జానారెడ్డి, డీకే అరుణ, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్ సహా అనేక మంది సీనియర్లను బరిలో ఉంచాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.


కాంగ్రెస్ పార్టీ సీనియర్లను రేసులో ఉంచనుందనే టాక్ వస్తుండటంతో... అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్... ఈ విషయంలో ఏ మాత్రం ఛాన్స్ తీసుకొవద్దనే భావనలో ఉన్నారు. అందుకే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్లను రంగంలోకి దింపితే... టీఆర్ఎస్ తరపున కూడా సీనియర్లనే బరిలోకి దింపాలని కేసీఆర్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.ఇందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలకు కేసీఆర్ సంకేతాలు ఇచ్చారని... అవసరమైతే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదల తరువాతే టీఆర్ఎస్ జాబితాను విడుదల చేయాలని కేసీఆర్ నిర్ణయించుకోవడం వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమే అని తెలుస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com