అధికార టీఆర్ఎస్ పై బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కారు, పదహారు, తెలంగాణ ప్రజలు బేజారు అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే.. కేసీఆర్ కుటుంబానికి గులాంగిరి చేసేందుకు ఉపయోగపడుతుందని ఆరోపించారు. అసదుద్దీన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ.. బీజేపీని కేటీఆర్ మతతత్వ పార్టీ అని విమర్శించడం తగదని అన్నారు. బీజేపీ హిందూత్వ పార్టీ కాదని, ఈ విషయంలో కేటీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదని తెలిపారు. ఖాసీమ్ రజ్వీ స్ధాపించిన ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని మమ్మల్నీ విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. రజాకార్ల ఆలోచన విధానంతో పని చేస్తూ.. హిందువులకు వ్యతిరేకమైన ఎంఐఎంతో కలిసి బీజేపీని విమర్శిస్తారని మండిపడ్డారు. కేంద్రంలో ఒవైసీని మంత్రిగా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని టీఆర్ఎస్ కలలు కంటుందని అన్నారు.
పోలింగ్ రోజు పెట్టిన సిరా గుర్తు ఆరక ముందే కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంటుందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో రాహుల్ గాంధీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. రాహుల్ రాష్ట్రానికి వచ్చి వెళ్లిన వెంటనే పెద్ద నాయకులు కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం బీజేపీనే అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.