ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్త మరణంతో కోడలి సంబరం..కొట్టి చంపిన భర్త

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 07:52 PM

అత్త లేని కోడలు ఉత్తమురాలని ఓ సామెత. అత్తాకోడళ్ల విషయంలో ప్రతి ఇంట్లోనూ ఏదో రకమైన గొడవలు ఉంటాయి. రాచి రంపానపెట్టే కొంత మంది అత్తలను ఉద్దేశించి ఆమె పీడ విరగడైతే బాగుండని కోడళ్లు అనుకుంటారు. కానీ, నిజంగా అత్త చనిపోయిన రోజున కన్నీళ్లు కారుస్తారు. లేని ప్రేమ ఒలకబోస్తారు. అయితే.. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ మాత్రం అత్త చనిపోతే సంబరపడిపోయింది. బహిరంగంగానే తన ఆనందం వ్యక్తం చేసింది. ఇది ఆమె భర్తకు పట్టరాని కోపం తెప్పించింది. క్షణికావేశంలో అతడు ఆమెను కొట్టి చంపేశాడు.

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా రజ్వాడా పోలీసుస్టేషన్‌ పరిధిలో మార్చి 9న ఈ ఘటన చోటుచేసుకుంది. సందీప్ లోఖండే (40), శుభంగి (36) అనే దంపతులు కొల్హాపూర్ పట్టణంలోని రజ్వాడా ప్రాంతంలో నివసిస్తున్నారు. సందీప్ తల్లి మాలతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆ వృద్ధురాలు మార్చి 9న మరణించింది. అత్త మరణంతో కోడలు శుభంగి లోఖండే ఎంతో ఆనందపడింది. ఆ ఆనందాన్ని మనసులో దాచుకోలేక బయటపడిపోయింది. ఆమె తన భర్త వద్దకు వెళ్లి ఇలా అంది.. ‘తల్లి మరణించడం అనేది పెద్ద విషయం కాదు. బాధపడకు..’ అని చెప్పింది. అంతేకాకుండా తమ తొలి సంతానం మరణించడానికి అత్తే కారణమంది.

భార్య శుభంగి మాటలతో సందీప్‌ లోఖండేకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పట్టరాని కోపంతో అతడు తన భార్యను ఇంటి పైఅంతస్తు నుంచి కిందకు తోసేశాడు. మెట్లపై నుంచి దొర్లుకుంటూ కిందపడ్డ శుభంగి తీవ్ర గాయాలపాలైంది. సాయం కోసం అర్థిస్తుండగా.. ఆవేశంగా కిందకు వచ్చిన భర్త ఓ ఇనుప వస్తువు తీసుకొని ఆమె తల మీద నుంచి బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.క్షణికావేశంలో భార్యను కడతేర్చిన సందీప్.. ఆ విషయాన్ని కప్పి పెట్టే ప్రయత్నం చేశాడు. తన తల్లి మరణ వార్తతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని.. ఈ కారణంగా మెట్ల పైనుంచి జారిపడిందని బంధువులను నమ్మించాడు. ఈ విషయం మీడియా కాస్త చెవిన పడటంతో ‘అత్త మృతిని తట్టుకోలేక ప్రాణాలో కోల్పోయిన కోడలు’ అంటూ వార్తలు వండివార్చాయి.

అయితే.. శుభంగి మృతిపై కొంత మంది బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. సందీప్ తన భార్యను చంపడానికి వినియోగించిన వస్తువును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతణ్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com