కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గతకొద్ది రోజులుగా ప్రగతి భవన్ కు క్యూ కడుతున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి జైకొట్టగా తాజాగా మరో ఇద్దరు వరుసలో ఉన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, సంగారెడ్డి ఎమ్మేల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. వనమా వెంకటేశ్వర రావు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది. తూర్పు జగ్గారెడ్డి నుంచి సన్నిహితులు, ముఖ్య కార్యకర్తలకు అందుబాటులోకి రాకుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. కొద్ది రోజులుగా ఆయన మాజీ మంత్రి టి.హరీశ్ రావు పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో హరీశ్ రావు ఆధిపత్యాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గం నాయకుడు, కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. జగ్గారెడ్డి ని కూడా చేర్చుకుంటే టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పూర్తిగా తమ ఆధిపత్యంలోకి వస్తుందనేది గులాబి బాస్ కేసీఆర్ ఆలోచనగా ఉంది. కొత్తగూడెం నుంచి గెలుపొందిన వనమా వయసులో, రాజకీయాలలో సీనియర్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకకుండా ఆయన కుమారుడిని రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి కనుచూపు మేరలో లేకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడు లేకపోవడం పెద్ద లోటుగా కన్పిస్తున్నది. ఇవన్నీ ఆలోచించిన ఆయన టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
టీఆర్ఎస్ లో చేరిన, చేరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు -
1. ఆత్రం సక్కు – ఆసిఫాబాద్
2. రేగా కాంతారావు – పినపాక
3. చిరుమర్తి లింగయ్య - నకిరేకల్
4. హరిప్రియా నాయక్ – ఇల్లందు
5. కే. ఉపేందర్ రెడ్డి – పాలేరు
6. పీ.సబితా రెడ్డి – మహేశ్వరం
7. డీ.సుధీర్ రెడ్డి – ఎల్బీ నగర్
8. వనామా వెంకటేశ్వర రావు - కొత్తగూడెం
9. తూర్పు జగ్గారెడ్డి – సంగారెడ్డి.