హైదరాబాద్: మార్కెటింగ్ శాఖ పనితీరుపై ఆ శాఖ ఉన్నతాధికారులతో రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సచివాలయంలో సమీక్ష చేపట్టారు. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్శాఖ సంచాలకులు లక్ష్మీబాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, కనీస మద్దతు ధరలు, నగదు చెల్లింపు, రైతుల ఇబ్బందులు, గోదాముల నిర్వహణపై మంత్రి భేటీలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాల దృష్ట్యా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. మద్దతు ధరపై సేకరించిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు జరగాలన్నారు. అసంపూర్తిగా ఉన్న గోదాముల పనులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న నాబార్డు గోదాములను సరుకులతో నింపాలని తెలిపారు. మార్కెట్ రుసుం పక్కాగా వసూలు చేయాలన్నారు. పంట అమ్మిన రైతులకు కంప్యూటరైడ్జ్ తక్ పట్టీలు ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు.