ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై టీఆర్ఎస్ నాయకుడు పిడమర్తి రవి నిప్పులు చెరిగారు. మందకృష్ణ మాదిగ అంబేద్కర్ వ్యతిరేకి అని రవి ధ్వజమెత్తారు. అంబేద్కర్ మహర్, జగ్జీవన్రాం చమర్ అంటూ మాల, మాదిగల మధ్య గొడవలు పెట్టారు. వేసవిలో ఏ పని లేక పంజాగుట్ట విగ్రహం గొడవ తెరపైకి తెచ్చారు. మందకృష్ణ ఏనాడైనా మాదిగలను అంబేద్కర్ జయంతిలో పాల్గొనేలా చేశాడా? అని రవి ప్రశ్నించారు. ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో అయినా అంబేద్కర్ జయంతి చేసిండా? అని అడిగారు. తను అంబేద్కర్ కంటే గొప్పవాడినని ప్రచారం చేసుకున్నాడు. పంజాగుట్ట నడిరోడ్డుపై అంబేద్కర్ విగ్రహం కావాలా.. తెలంగాణ సీఎం ఏర్పాటు చేస్తామన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కావాలో అంబేద్కర్వాదులు తేల్చుకోవాలని సూచించారు.
మందకృష్ణ ఏ ఉద్యమం చేసినా అది స్పాన్సర్డ్ ఉద్యమమే అయి ఉంటదని పేర్కొన్నారు. ఒకరి మీద కోపంతో మరొకరితో జట్టుకట్టి ఉద్యమాలు చేస్తాడు. 27న మందకృష్ణ చేస్తానంటున్న ఉద్యమం కాంగ్రెస్ సమ్మర్ స్పాన్సర్డ్ ఉద్యమం అని రవి ఎద్దెవా చేశారు. మాదిగల ఓట్లు అగ్రకులాలకు అమ్ముకున్న వ్యక్తి మందకృష్ణ. తెలంగాణలో కాంగ్రెస్కు ఓట్లు అమ్ముకున్న వాళ్లు అంబేద్కర్వాదులా? మందకృష్ణ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పెట్టే సభ కాంగ్రెస్ ఏజెంట్ల గర్జన. మందకృష్ణ ఉద్యమం చేయలేదు. అది కేవలం తన కోసం ఉద్యోగంగానే భావిస్తున్నాడు అని పిడమర్తి రవి పేర్కొన్నారు.