రోల్స్ రాయిస్ కారు..5 కోట్లపైనే ఉండే అత్యంత ఖరీదైన ఈ కారు కేవలం కోటి రూపాయలకే సొంతం చేసుకునే అవకాశం రానుంది. అయితే ఈ అరుదైన అవకాశం ముంబైలో అందుబాటులో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం నిందితుడు నీరవ్ మోదీకి చెందిన ఖరీదైన కార్లను వేలం వేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ణయించింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్న ఈడీ..ఈ మేరకు నీరవ్మోదీకి చెందిన 13 లగ్జరీ కార్లను వేలం వేయనుంది. రోల్స్ రాయిస్, పోర్సె పనమెరా, 2 మెర్సిడేజ్ బెంజ్, 3 హోండా కార్లు, టయోటా ఫార్చునర్, ఇన్నోవా, 2 హోండా బ్రియోస్తోపాటు ఇతర కార్లున్నాయి.
వేలంలో పాల్గొనే బిడ్డర్లకు ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 23 వరకు ఆ వాహనాలు చెక్ చేసుకునేందుకు అవకాశమిచ్చారు. అయితే ఈ కార్లకు టెస్ట్ డ్రైవ్ చేసుకునేందుకు మాత్రం అనుమతి లేదు. లగ్జరీ కార్లకు సంబంధించిన ఫొటోలు, వాటి ధర, మోడల్, రిజిస్ట్రేషన్ నంబర్, స్థలం వంటి వివరాలను మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎస్టీసీ) తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆదాయపన్ను శాఖ అధికారులు ఇప్పటికే ముంబైలో నీరవ్మోదీకి సంబంధించిన 55 పెయింటింగ్స్ను సాఫ్రాన్ ఆర్ట్ గ్యాలరీ వద్ద అమ్మకాలు జరిపింది. పెయింటింగ్స్ అమ్మడం ద్వారా ఐటీ శాఖ రూ.54 కోట్లు ఆర్జించింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను వేల కోట్ల రూపాయలు ముంచి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.