సిద్దిపేట: జిల్లాలోని దుబ్బాక మండలంలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని చిన్నారులను మద్యం మత్తులో ఉన్న ఓ తండ్రి బలి తీసుకున్నాడు. అంతేకాదు, తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం లచ్చపేటలో బడుగు రాజేందర్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఏడాది క్రితం అతడి భార్య మరణించడంతో ఇద్దరు కూతుళ్లు భవాని(9), లక్ష్మీ(5)తో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి తన ఇద్దరు కూతుళ్లను గొంతు నులిమి చంపేశాడు. అంతేకాదు, అతడు కూడా ఉరి వేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఇది జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.