హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల రెండో విడుత ఘట్టం మొదలైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఒకే విడుతలో ఎన్నికలు పూర్తవగా.. రెండో విడుతగా 31 జిల్లాల పరిధిలోని 180 జెడ్పీటీసీ స్థానాలు, 1,913 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు ఇవాళ నోటిఫికేషన్ జారీకానున్నది. నామినేషన్ల స్వీకరణ ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి మొదలుకానున్నది. ముందుగా నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రాదేశిక నియోజకవర్గాలవారీగా తుది ఓటరు జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేస్తారు. అనంతరం నామినేషన్లను స్వీకరిస్తారు. జెడ్పీటీసీ స్థానానికి ప్రతి మండలంలో ఒక రిటర్నింగ్ అధికారి ఉండగా.. ప్రతీ మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. కేటాయించిన గ్రామాల్లో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 28 వరకు నామినేషన్లను స్వీకరించి, 29న నామినేషన్లను పరిశీలించి అర్హత సాధించినవారి జాబితా విడుదల చేస్తారు. 30న అభ్యంతరాల స్వీకరణ, వచ్చేనెల 1న అభ్యంతరాలను పరిశీలిస్తారు. మే 2న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించి, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితా విడుదల చేసి గుర్తులు కేటాయిస్తారు. మే 2 నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం నిర్వహించుకొనే అవకాశం కల్పించి, మే 10న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.