ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఐదారు రోజుల్లో మరింత ఎండలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2019, 12:13 PM

గత 68 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్‌లో ఎండలు తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు భయంకర గాలులు, తేమతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏపీ, తెలంగాణలో వచ్చే ఐదారు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత అత్యధికంగా నమోదువుతాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడు రోజుల కిందట హైదరాబాద్‌ నగరంలో గంటకు 78 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులకు ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్‌ టవర్‌ కూలిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ గంటకు 50 కి.మీ.వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఏప్రిల్ 29,30 తేదీల్లోనూ ఏపీలో పలుచోట్ల ఇదే తరహా భీకర గాలులకు అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 


ఉత్తరాది నుంచి పొడిగాలులు, దక్షిణాది నుంచి తేమ గాలులు కలిసే చోట ఈ తరహా భయంకర పరిస్థితి ఉంటుందని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. అదే సమయంలో మేఘాల్లో పీడనం తక్కువగా ఉండటం వల్ల భూమిపై ఉన్న వేడి, తేమను వేగంగా తనలోకి తీసుకుంటుందని, ఆ సమయంలో బలంగా మారి క్యుములోనింబస్‌ మేఘాలుగా ఏర్పడతాయని వివరిస్తున్నారు. కొద్ది రోజుల నుంచి తెలుగురాష్ట్రాల్లో ఎండలతోపాటు గాలిలో తేమ 70 శాతానికి మించే ఉంటుంది. ఈ రెండింటి వల్ల ఆయా ప్రాంతాల్లో వాతావరణ అస్థిరత ఏర్పడి, జోరుగాలి, వర్షం కురుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 30న రాయలసీమలో ఇలాంటి పరిస్థితులకు అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 


 


గత రెండు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఈ వారం 40- 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే సంకేతాలు అందుతున్నాయి. ఏపీలో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, తెలంగాణలోని వరంగల్‌, ఖమ్మం జిల్లాల ప్రజలు ఉష్ణతాపానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు. వాస్తవానికి ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మే చివరి వారంలో ఉంటాయి. అలాంటిది ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి వారంలో ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 1951 నుంచి 2019 వరకు నమోదైన ఉష్ణోగ్రతల సరాసరిని అంచనా వేస్తే ఏప్రిల్‌లో ఎప్పుడూ ఇంతటి ఉష్ణోగ్రతలు లేవని అంటున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com