ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యవిమాన గోపురానికి బంగారు తాపడం!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2019, 08:34 PM

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్యవిమాన గోపురానికి బంగారు తాపడం చేయడానికి అవసరమైన పనులను వైటీడీఏ వేగిరం చేసింది. యాదాద్రి దివ్యవిమాన గోపురానికి బంగారు తాపడం చేయడానికి అత్యాధునిక పద్ధతైన గోల్డ్ ఎలక్ట్రోప్లెటింగ్ విధానం ద్వారా 30 కిలోల బంగారం అవసరమవుతుందని డీఎంఆర్‌ఎల్ ల్యాబోరేటరికి చెందిన నిపుణులు, సీఎం కేసీఆర్ నియమించిన టెక్నికల్ కమిటీ నిపుణులు నిర్ధారించారు. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. తిరుమల తిరుపతి ఆలయ విమానగోపురానికి అమర్చిన గోల్డ్‌ప్లెటింగ్ విధానం కన్నా అత్యాధునికమైన గోల్డ్ ఎలక్ట్రోప్లెటింగ్ విధానం యాదాద్రి దివ్యవిమాన గోపురానికి అమలు చేయడం మంచిదని నిపుణులు అభిప్రాయపడ్డారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో అష్టభుజి ప్రాకార నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రాకారం నాలుగువైపులా అష్టభుజి మండప నిర్మాణాలు జరుగనున్నాయి. అష్టభుజి మండప నిర్మాణ పనులను స్తపతులు సుందరరాజన్, డాక్టర్ ఆనందచార్యుల వేలులు పర్యవేక్షించారు. ప్రాకారాలకు అష్టభుజి మండప నిర్మాణాలు ప్రత్యేక శోభను కలిగించనున్నాయి. ఇందులో కింది భాగంలో ఏనుగులు పడుకున్నట్టుగా, ఏనుగు మధ్యభాగంలో ఉపపీఠాలు, వాటిపైన బాలపాద స్తంభములు, వాటిపైన రూప్‌స్టోన్స్ తదితర సామగ్రిని అమర్చనున్నారు. దేవస్థానం ఖజానాలో ఉన్నటువంటి బంగారు నిల్వలను కరిగించి దివ్యవిమాన గోపురానికి బంగారు తాపడం చేసే పనులు నిర్వహిస్తామని తెలిపారు. సంప్రదాయ పద్ధతి అయిన గోల్డ్‌ప్లెటింగ్ విధానంలో బంగారం ఎక్కువ అవసరమవుతుందని నిపుణులు పేర్కొన్నారని తెలిపారు. పాత పద్ధతిలో విమానగోపురానికి బంగారం తాపడానికి మరో రూ.70 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. కొత్త విధానంలో అయితే ప్రస్తుతం నిపుణులు పేర్కొంటున్నట్లుగా 30 కిలోల బంగారం సరిపోతుందని తెలిపారు. పాత పద్ధతిలో బంగారం తాపడం చేయడానికి మెర్క్యూరీ వాడేవారని, కొత్త విధానంలో నిఖెల్ వాడుతారని చెప్పారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com