న్యూఢిల్లి : ఢిల్లి-హౌరా, ఢిల్లి-ముంబై రైళ్ల వేగాన్ని పెంచడానికి రైల్వే శాఖ కార్యాచరణ ప్రారంభించింది. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ రెండు మార్గాల్లోనూ రైళ్ల వేగాన్ని గణనీయంగా పెంచాలని, తద్వారా ప్రయాణ సమయాన్ని తగ్గించాలని రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో ఢిల్లి-ముంబై, ఢిల్లి-హౌరా మార్గాల్లో రైళ్ల వేగాన్ని 160 కిలోమీటర్ల వేగానికి పెంచాలని నిర్ణయించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రైళ్ల వేగం పెంపుదలకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారని ఆ అధికారి చెప్పారు. రైళ్ల వేగం పెంచడం వల్ల ఢిల్లి-హౌరా, ఢిల్లి-ముంబైల మధ్య ప్రయాణ సమయం వరుసగా 12 గంటలు, 10 గంటలకు తగ్గుతుందని ఆ అధికారి అన్నారు. ప్రస్తుతం ఈ ప్రయాణ సమయం వరుసగా 17 గంటలు, 15.5 గంటలుగా ఉంది.