తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా మారుస్తామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ లలో ఒకే విధమైన సేవలు అందేలా కృషి చేస్తామన్నారు. మంగళవారం జులై 16 ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లలో ఉన్న పనులను 16 విభాగాలుగా విభజించి.. ఒక్కో విభాగానికి ఒక్కో అధికారిని నియమించి వారికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. నూతన టెక్నాలజీ సాయంతో నేరస్థులకు శిక్షలు పడేలా చేస్తున్నామని చెప్పారు. బాధితులు ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్లినా సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 18 వేల పోలీస్ సిబ్బంది నియామకాలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ చందానగర్ పోలీసులు నేరాల అదుపునకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో స్కిల్ డెవలప్ మెంట్ ను పెంపొందించుకొని సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అనుసరిస్తున్నారని చెప్పారు. కోర్టులలో పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారని చెప్పారు. ప్రజలే-పోలీసులు, పోలీసులే-ప్రజలు.. అనే భావన కలిగించిన చందానగర్ పోలీసుల పనితీరును ఆయన అభినందించారు. మిగతా పీఎస్ లు చందానగర్ పీఎస్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.