తెలంగాణ ప్రభుత్వం ఉత్తర భారతదేశానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చిన్న చూపు చూస్తోందని ఆరోపిస్తూ, ఐపీఎస్ సీనియర్ అధికారి వీ.కే.సింగ్ (వినయ్ కుమార్ సింగ్) తన ఉద్యోగానికి రాజీనామా చేసారని సమాచారం. ఈనెల నాలుగు నుంచి ఎనిమిది వరకూ సెలవు పెట్టి తన సొంత రాష్ట్రం బీహార్ వెళ్లిన సమయంలో తనను బదిలీ చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఐదేళ్లుగా జైళ్ల శాఖ డీజీగా పని చేస్తున్న వీ.కే.సింగ్ ను ఈ నెల 6 వ తేదీన వీ.కే.సింగ్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అయితే ఇది జరిగి పది రోజులుకావస్తున్నా ఆయన విధుల్లో చేరలేదు.
1987 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన వీ.కే.సింగ్ ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో పనిచేస్తున్నారు. మరో మరో రెండేళ్లు సర్వీసు మాత్రమే ఉండటం, అందరికన్నా సీనియర్ కావటంతో తనకు డీజీపీ హోదా వస్తుందని ఆశిస్తున్నారు. అయితే ఊహించని విధంగా జైళ్ల శాఖ నుంచి అప్రధానమైన శాఖకు ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ శాఖకు బదిలీ చేయడం పట్ల ఆయన తీవ్ర మనస్తాపం కు గురయ్యారు. ఉత్తర భారత్ నుంచి నిబద్దతతో పనిచేసేందుకు ఇక్కడకు వస్తే, తెలంగాణ ప్రభుత్వం తమని ఉద్దేశ పూర్వకంగానే బదిలీలు చేస్తోందని, ఆయన సహచర ఉన్నతాధికారుల వద్ద వాపోతూ, రాజీనామాకు సిద్ధపడ్డారని సన్నిహితులు చెబుతున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.