హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా భారత రక్షణ వ్యవస్థకు కావల్సిన ఆయుధాలను అందిస్తున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) మంగళవారంతో 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. అనేక సవాళ్లు, లక్ష్యాల మధ్య 1970లో ప్రారంభమైన ఈ సంస్థ త్రివిధ దళాలకు కావాల్సిన క్షిపణులు, ఇతర రక్షణ అయుధాలను సరఫరా చేస్తున్నది. స్వర్ణోత్సవాలకు సిద్ధమైన వేళ బీడీఎల్ సీఎండీ సిద్ధార్థ్ మిశ్రా మీడియా సమావేశంలో మాట్లాడారు. రక్షణ దిగుమతులను చేసుకోవటంలో భారత్ ముందు వరుసలో ఉండేదని, అయితే బీడీఎల్ ఏర్పాటు తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు చెప్పారు. అత్యాధునిక సాంకేతికత గల ఆయుధాలను ఆర్మీకి అందించేందుకు డీఆర్డీవో సహకారంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. స్వర్ణోత్సవాల సందర్భంగా రూపొందించిన లోగో, కాలర్ ట్యూన్ను ఆవిష్కరించారు. 50 ఏండ్ల కాలంలో బీడీఎల్ ఉత్పత్తి చేసిన క్షిపణనులను, ఇతర రక్షణ వ్యవస్థలను ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఇందులో అతి ముఖ్యమైన మిలాన్2టి, ఆకాశ్, అస్త్ర, పృధ్వి, తాల్, మిలాన్ వంటి అత్యాధునిక క్షిపణులున్నాయి.