ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చేసింది ‘డెంగీ’ కాలం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2019, 04:32 PM

వర్షాకాలం మొదలైంది అంటే చాలు... ముఖ్యంగా జులై, ఆగస్టు మాసం వచ్చిందంటే... డెంగీ కాలం వచ్చేసినట్టే. ఎందుకంటే ఎక్కడ చూసిన దోమలు రాజ్యమేలుతూ ఉంటాయి. అవి మనల్ని కుట్టినప్పుడు కాసేపు దురద పుడుతుంది అంతే. తర్వాత అసలు మ్యాటర్ మొదలౌతుంది. దోమ కుట్టిన మంట కంటే.. దాని తర్వాత మొదలయ్యే జబ్బుల తంటాలు ఎక్కువైపోతాయి. దోమల వల్ల ఎక్కువ మంది డెంగీ జ్వరాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు విపరీతంగా విస్తరించిపోతున్నాయి. డెంగీ కారణంగా చనిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే... డెంగీ వచ్చిందని భయపడాల్సిన పనిలేదు. సరైన  చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..


డెంగీ దోమ స్పెషాలిటీ...


డెంగీ దోమలు పగలు మాత్రమే కుడతాయి. కుట్టినప్పుడు మనకు నొప్పి తెలీదు. మంచినీటిలోనే ఎక్కువగా పెరుగుతాయి. ఇవి 100మీటర్లు దాటి ప్రయాణం చెయ్యలేవు. సాధారణంగా శరీరంలో కాళ్లు, పాదాల వంటి కింది భాగాల్లోనే ఎక్కువగా కుడతాయి. ఈ దోమ చూడటానికి కాస్త పెద్దదిగా, నల్లటి చారలతో ఉంటుంది. దీనిని టైగర్ దోమ అని కూడా పిలుస్తారు.


డెంగీ దోమ నుంచి తప్పించుకునేదెలా...


ఈ దోమ మనం మెలకువగా ఉన్న సమయంలోనే కుడతుంది. ఎక్కువ దూరం ప్రయాణించలేవు. కాబట్టి మన చుట్టూ ఉండే 100మీటర్ల దూరంలోపు ఎక్కడా నీటి నిల్వ లేకుండా ఉండేలా చూసుకోవాలి. మన చుట్టుపక్కల ప్లాస్టిక్ మాటిల్లు, పాత టైర్లు, నీటి కుండీలు లాంటివి ఉండకుండా ఉండేలా చూసుకుంటే మంచిది. మస్కిటో కాయిల్స్ లాంటివి దగ్గర ఉంచుకోవడం బెటర్.


ఫుల్ హ్యాండ్స్ డ్రస్ లు వేసుకోవడం.. కాళ్లకు సాక్సులు లాంటివి కచ్చితంగా వేసుకోవాలి. టేబుల్స్, కర్టెన్స్ కింద దోమలు దాక్కొని ఉంటాయి కాబట్టి... ఆ ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవసరమైతే దోమలు కుట్టకుండా ఉండేందుకు మార్కెట్లో కొన్ని క్రీములు లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించడం మంచిది.


డెంగీ లక్షణాలు...


డెంగీ జ్వరం వస్తే... టెంపరేచర్ 105 వరకు వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. అయితే... జ్వరం ఉన్నప్పటి కంటే... తగ్గిన తర్వాత డెంగీ ప్రమాదకరంగా మారుతుంది. శరీరంపై ఎర్రటి మచ్చలు రావడం, ప్లేట్ లెట్స్ పడిపోవడం, బీపీ తగ్గడం లాంటివి జరగుతుంటాయి. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్లేట్ లెట్స్ పెరగడానికి ఉపయోగపడే ఆహారం తీసుకోవాలి. 


జ్వరం తగ్గాక ఒంటి మీద మచ్చలు వస్తున్నా, తీవ్ర నిస్సత్తువగా ఉన్నా, కాళ్లూ చేతులూ చల్లగా ఉంటున్నా, కడుపులో నొప్పి వస్తున్నా, వాంతులు ఎక్కువ అవుతున్నా.. చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నా.. పడుకుని లేవగానే కళ్లు తిరుగుతున్నా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.


ప్లేట్ లెట్స్ సంఖ్య ఎంత ఉండాలి..


డెంగీ జ్వరం వచ్చినప్పడు ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోవడం సహజం. అయితే.. కొంచెం తగ్గితేనే భయపడాల్సిన అవసరం లేదు. కొద్ది పాటి తగ్గుదలకు ప్లేట్ లెట్స్ రక్తం ద్వారా ఎక్కించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యవంతుల శరీరంలో 1.5నుంచి 4లక్షల వరకు ప్లేట్ లెట్స్ ఉంటాయి. వీటిని లక్ష కన్నా తక్కువ పడిపోకుండా చూసుకోవాలి. 20వేలకు పడిపోతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ప్లేట్ లెట్స్ ఎక్కించడం తప్పనిసరి. 


ఒంటి నొప్పులకు మందులు...


సాధారణంగా ఒంటి నొప్పులకు అందరూ పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అయితే... డెంగీ సమయంలో మాత్రం పెయిన్ కిల్లర్స్ వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. జ్వరానికి కూడా పారాసెట్మాల్ తప్ప మరేదీ వాడకుండా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com