స్వప్న సాగర్ వేధనభట్ల(బెంగళూరు) గారి ప్రశ్న:
ప్రభుత్వాలెన్ని చట్టాలు చేసినా, నిర్భయ్ సాక్షిగా అత్యాచారాలు ఇటీవల కాలంలో పెరిగి పోతునే ఉన్నాయి. దీనికితోడు పత్రికలలో అత్యాచార బాధితుల ఫోటోలని ప్రముఖంగా ప్రచురించడం వల్ల బాధితులకు మరింత ప్రాణ సంకటంగా మారి, ఉన్న ఊరు వదిలి వేరే చోట బతకాలనుకున్నా, నిషరాలు, నిందలు పడాల్సి వస్తోంది. ఈ విషయంలో మీడియా తీరు మారాలి. పత్రికాధినేతగా మీ కామెంట్...
నూకారపు సూర్యప్రకాష్ రావు గారి సమాధానం :
నిజమేనమ్మ స్వప్నగారూ! పత్రికలలో అత్యాచార బాధితుల ఫోటోలని ప్రముఖంగా ప్రచురించడం వల్ల బాధితుల గౌరవ ప్రతిష్టలకు భగం కలుగుతోంది. అందుకే అత్యాచారానికి గురైన మైనర్ బాలికల ఫోటోలను ప్రచురించడాన్ని సుప్రీం కోర్టు పూర్తిగా నిషేధించింది. అత్యాచార బాధితుల మార్ఫింగ్ చేసిన ఫోటోలను సైతం మీడియా ప్రచురించరాదని ఆదేశించింది. బిహార్లోని ముజఫర్పూర్ వసతిగృహంలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికల ఫోటోలు, వారిని ఇంటర్వ్యూలు చేస్తూ ప్రసారం చేసిన వీడియోలను నిషేధించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచార బాధితుల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని బిహార్ కేసును సుమోటాగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. మైనర్ బాలికలు గోప్యతకు భంగం కలిగేలా మీడియా వ్యవహరిస్తుందంటూ పట్నాకు చెందిన హక్కుల కార్యకర్త రన్విజయ్ కుమార్ న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ మిశ్రాల ధర్మాసనం దీనిపై బిహార్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అప్పటికే గాయపడిన బాధితులను మీడియా మళ్లీ మళ్లీ బలవంతంగా గాయపరచడం మానుకోవాలని, బాధితులను నేరుగా కలవకుండా ప్రభుత్వ సంస్థలు రక్షణ కల్పించాలని ధర్మాసనం సూచించింది. ప్రమాదవశాత్తు గుహలో చిక్కుకున్న ఫుట్ బాల్ కోచ్, బాలలను గుహ నుంచి సురక్షింతంగా వారిని తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ పూర్తయిన వరకూ ఆ పిల్లలు ఎవరో కనీసం తెలియలేదని, అక్కడి మీడియా ఎంతో సంయమనం పాటించారని వ్యాఖ్యానించింది. ఒకవేళ బాలల హక్కుల సంస్థలతోపాటు ఇతర ప్రభుత్వ, దర్యాప్తు ఏజెన్సీలు వారిని కలవాలంటే ప్రొఫెషనల్ కౌన్సెలర్లు, పిల్లల మానసిక వైద్యనిపుణుల సాయం తీసుకోవాలంది. వీలున్నంత వరకు మా పత్రికలో ఈ తరహా ఫోటోలు రాకుండా చూస్తున్నాం.