విదేశీ నగదు మార్పిడి కోసం వచ్చిన ఇద్దరు నకిలీ నోట్లు అంటగట్టి రూ.89 వేలతో ఉడాయించిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో జరిగింది. వివరాలలోకి వెళితే శనివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు నవీపేటలోని మీ సేవ కేంద్రానికి వచ్చారు. వీరిలో షకీల్ అనే వ్యక్తి మీ సేవ కేంద్రంలోని ఆపరేటర్ రేఖనుకలసి యూఏఈకి చెందిన 4,800 దిర్హమ్స్ విలువైన అసలు నోట్లు తీసుకొచ్చి నగదు మార్పిడి చేయాలని కోరారు. వీటిని పరిశీలించిన ఆమె రూ.88,800 ఇస్తామని చెప్పారు. అయితే చాలా తక్కువ ఇస్తున్నారని ఆమెతో కొంతసేపు వాగ్వాదానికి దిగి , , ఇచ్చిన దీనారాలు తిరిగి వెనక్కి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి మళ్లీ వెనక్కి వచ్చిన షకీల్ కనీసం రూ.200 కలిపి రూ.89 వేలు ఇవ్వాలని కోరటంతో రేఖ అందుకు అంగీకరించింది. దీంతో నోట్లను ఒక పర్సులో పెట్టి ఆపరేటర్ రేఖకు అందించాడు. వాటిని అందుకున్న ఆమె రూ.89 వేలు (భారత కరెన్సీ) షకీల్కు అందిందించిన క్షణాలలోనే షకీల్, అతడితో వచ్చిన మరో వ్యక్తి అక్కడి నుంచి ద్విచక్రవాహనం పై వెళ్లిపోయారు.
కాసేపటికే షకీల్ ఇచ్చిన పర్సు తీసిచూడగా అసలైన నోట్లకు బదులు వాటి కలర్ జిరాక్స్ నోట్లు ఉండటంతో విస్తుపోవటం మీసేవ ఉద్యోగుల వంతైంది. షకీల్ రెండోసారి రావడంతో అవి అసలు నోట్లేనని భావించానని, పర్సు జిప్ రాకపోవటంతో కొంత ఇబ్బంది పడుతున్న సమయంలో ఆతను తొందర పెట్టి నగదు తీసుకున్నట్టు రేఖ చెపుతోంది.
ఈ విషయాన్ని మీసేవ యజమానికి తెలియటంతో ఆయన నవీపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.