ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో తెలుగు టైటాన్స్ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. సొంత ప్రేక్షకుల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 26-39 స్కోరుతో తమిళ్ తలైవాస్ జట్టు చేతిలో ఓడిపోయింది. గత కొంత కాలంగా తెలుగు టైటాన్స్కు ఆడిన స్టార్ రైడర్ రాహుల్ చౌదరీ ఈ సారి ప్రత్యర్థిగా మారి దెబ్బ కొట్టాడు.ఈ పోరులో టైటాన్స్ మొదటి పది నిమిషాలే తలైవాస్కు పోటీ ఇవ్వగలిగింది. తొలి నిమిషంలోనే రాహుల్ తలైవాస్కు పాయింట్ సాధించాడు. అయితే 4వ నిమిషంలో టైటాన్స్ సూపర్ టాకిల్ చేసి స్కోర్ను 3-4కు తగ్గించింది. టెటాన్స్ స్టార్ రైడర్ సిద్ధార్థ్ మొదటి పాయింట్ను సాధించడానికి చాలా సమయం తీసుకున్నాడు. తొలి 10 నిమిషాల ఆట ముగిసేసరికి టైటాన్స్ 7-6తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సమయంలో తలైవాస్ ఆటగాడు షబీర్ బాపు సూపర్ టాకిల్, రెండు రైడ్ పాయింట్లు తెచ్చాడు.
ఇక 16వ నిమిషంలో రాహుల్ రెండు రైడ్ పాయింట్లు సాధించాడు. 18వ నిమిషంలో కెప్టెన్ అజయ్ థాకూర్ సూపర్ రైడ్ చేయడంతో మొదటి అర్ధభాగం ముగిసే సరికి తలైవాస్ 20-10తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో టైటాన్స్ ఆట తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. మరోవైపు ఆటగాళ్లు పాయింట్ల కోసం శ్రమించినా తలైవాస్ పటిష్టమైన డిఫెన్స్ను చేధించడంలో సఫలం కాలేకపోయారు. చివరి ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 20-32తో వెనకబడి ఓటమిని ఖాయం చేసుకుంది. తలైవాస్ ఆటగాడు మంజిత్ చిల్లర్ (6) ట్యాక్లింగ్లో చెలరేగాడు. 13 సార్లు రైడ్కు వెళ్లి కేవలం 5 పాయింట్లే సాధించిన సిద్ధార్థ్ దేశాయ్ మరోసారి నిరాశపరిచాడు.ఏడో సీజన్ను గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ మంచి విజయంతో ఆరంభించింది. గుజరాత్ 42-24 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు బుల్స్ను చిత్తు చేసింది. రైడింగ్లో సచిన్ (7), ట్యాక్లింగ్లో సునీల్ కుమార్ (6) రాణించి గుజరాత్ జట్టుకు విజయాన్ని అందించారు. మరోవైపు బెంగళూరు జట్టులో పవన్ సెరావత్ (8) ఆకట్టుకున్నాడు. ఈ రోజు యు ముంబాతో జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి.