హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 302 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో సాగర్ అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. ఆదివారం కావడంతో సాగర్ పరిసరాలన్నీ పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంది. భారీగా ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీగా వాహనాల రాకతో వన్ వే విధానం ఏర్పాటు చేశారు.