ఊరంతటికీ ఒక్కడే వినాయకుడు. అదీ మట్టి విగ్రహం. వినాయకచవితి సందర్భంగా ఊరి ప్రజలందరూ అక్కడే పూజలు. వినడానికే ఎంత బాగుందో కదా. నిజంగా ఇది నిజమే. అందరం కలిసి ఒకే దగ్గర వినాయకుని పూజ చేద్దామంటూ మాజీ మంత్రి హరీష్రావు ఇచ్చిన పిలుపునకు మిట్టపల్లి గ్రామం స్పందించింది. యువత, మహిళలు, రైతులు, ప్రజాప్రతినిధులు సహా అన్ని వర్గాలూ ఓకే అన్నాయి. సంఘాలూ సరేనన్నాయి. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
అంతేకాదు... మిట్టపల్లి స్ఫూర్తిగా మరో ఐదు గ్రామాలు అదే నిర్ణయం తీసుకున్నాయి. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్, మాచపూర్ బండ చెర్లపల్లి, నారాయణరావుపేట మండలం కోదండరావుపల్లి గ్రామాల ప్రజలు కూడా... ‘పర్యావరణ పరిరక్షణకు మేమూ ముందుకొస్తాం. మా ఊరిలో ఒక్కడే వినాయకుడిని పెట్టుకుంటాం’ అంటూ తీర్మానాలు చేసుకున్నారు. వాటి ప్రతులను హరీష్రావు అందించారు. ఇక కొసమెరుపు ఏమిటంటే... మిట్టపల్లి గ్రామానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని హరీష్రావు ప్రకటించారు.