ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిండికేట్‌ బ్యాంక్‌లో ఘరానా మోసం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 07:26 PM

నకిలీ పాసుపుస్తకాలు.. ఏజెంట్‌లతో కలిసి బ్యాంకులో ఘరానా మోసానికి పాల్పడిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ బాధితులు బ్యాంక్‌ఎదుట ఆందోళనకు దిగారు.
జిల్లాలోని ఎడపల్లి మండల కేంద్రంలో గల సిండికేట్‌ బ్యాంక్‌లో జరిగిన అవినీతి భాగోతం ఎట్టకేలకు బయటపడింది. గతంలో మేనేజర్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి నకిలీ పాసుపుస్తకాలతో, ఏజెంట్‌లతో కుమ్మకై అవినీతికి పాల్పడినట్లు ఖాతాదారులు ఆరోపించారు. పంట రుణాలు, వ్యక్తిగత రుణాలు, డ్వాక్రా రుణాలలో సుమారు కోటి రూపాయల వరకు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి మేనేజర్‌ శ్రీనివాస్‌ తమ బంధువు ఆర్‌ఎం అండతో ఈ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న వారికి ఎలాంటి పత్రాలు లేకున్నా రుణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. డ్వాక్రా రుణాల రికవరీ సందర్బంగా ఏఆర్‌పీ క్యాంప్‌కు చెందిన మహిళలు రుణాలు చెల్లించి తిరిగి తీసుకునే క్రమంలో బ్యాంక్‌ అధికారులు పంట రుణం బకాయి ఉందంటూ రుణం ఇవ్వడాన్ని నిలిపివేశారు. దీంతో బ్యాంకులో జరిగిన అక్రమాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత మేనేజర్‌ చంద్రశేఖర్‌ బ్యాంకులో జరిగిన అవినీతి అక్రమాలపై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గత మేనేజర్‌ నిర్వాకం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు ఖాతాదారులు అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి బ్యాంక్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. సదరు మేనేజర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com