వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ నగరంలో విగ్రహాల ప్రతిష్టాపన, నిమజ్జనానికి సంబంధించి పోలీసులు కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండప నిర్వాహకులు ఖచ్చితంగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలు ఈ నెల 29 లోపు సమర్పించాలన్నారు.
సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గణేశ్ ఉత్సవాలు కొనసాగనున్న నేపథ్యంలో.. ఉదయం 6 నుంచి 12 సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. నిమజ్జనం పేరుతొ బాణసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధించామని, ఒక వేళ తమ ఆదేశాలు కాదని బాణసంచా పేల్చడం చేస్తే ఉత్సవ నిర్వాహకులపై చర్యలుంటా యని హెచ్చరించారు.
ఇక కమీషనర్ చెప్పిన వివరాల ప్రకారం పోలీసులకు అందచేసే అర్జీలల్లో విగ్రహ ప్రతిష్టాపన జరిగే స్థలం, సమయం, తేదీతో పాటు నిమజ్జనం చేసే తేదీ, సమయం, వెళ్లే రూట్, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారనే విషయాలను స్పష్టంగా రాయాలి. పోలీస్ క్లియరెన్స్కు వీలుగా విగ్రహ ప్రతిష్టాపన చేసే స్థల యజమానితో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందుపరచాలి. అది కూడా ట్రాఫిక్కు ఇబ్బంది లేని ప్రాంతమైతేనే అనుమతి ఉంటుంది.
వివాదస్పద స్థలంలో విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతించరు. అలాగే మండపాలకు . విద్యుత్ సరఫరాకు సంబంధించిన సదరు శాఖా పరంగా పొందిన అనుమతుల పత్రాలు కూడా సమర్పించాలి. అక్రమ విద్యుత్ వాడకాన్ని అనుమతించరు. చివరికి విగ్రహాల నిమజ్జనానికి సంబంధించిన వివరాలు ఏయే తేదీలలో ఏసమయానికి నిర్వహించేది మరో ప్రత్యేక దరఖాస్తు ద్వారా సంబంధిత ఏసీపీ లకు తెలియజేయాలి.
ఐతే అపార్టుమెంట్ సెల్లార్లలో విగ్రహాలు ప్రతిష్టించి నిమజ్జనానికి తరలించే వారు, పై నిభందనలు అనుసరించనవసరం లేదు. పోలీస్ క్లియరెన్స్ మాత్రం తప్పని సరిగా తీసుకోవాలి. . ఇళ్లలో విగ్రహాలను ప్రతిష్టించే వారికి ఈ నిబంధన లు వర్తించవు.