హైదరాబాద్లో మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నది. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నిమిషాల్లో సరైన సమయానికి గమ్యాన్ని చేరుస్తుండడంతో నగర వాసులు ముఖ్యంగా ఉద్యోగులు మెట్రో వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి హైటెక్ సిటీకి ఇలా రెండు కారిడార్ లలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మరీ ముఖ్యంగా అమీర్ పేట నుంచీ హైటెక్ సిటీకి రోజూ వేలాదిమంది ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తుంటారు. కాగా ఇప్పటి వరకు జూబ్లీ చెక్పోస్టు నుంచి హైటెక్ సిటీ వరకు సింగిల్ లైన్ ద్వారా రైళ్లు నడవగా..ఇప్పుడు ఈ రూట్ లో మెట్రో అధికారులు రివర్సల్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతోఇక నుంచి అమీర్పేట నుంచి హైటెక్సిటీ వరకు ప్రతి 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడవనుంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్లో ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు అందుబాటులోకి రానుంది.హైటెక్ సిటీ - అమీర్పేట కారిడార్లో 2, 3 వారాల పాటు ప్రతి 4 నిమిషాలకు ఒక రైలు నడవనుంది. ఆ తర్వాత పరిస్థితుల ఆధారంగా ప్రతి 3 నిమిషాలకు కూడా ఒక రైలు నడపనున్నారు.