తెలంగాణ ప్రజల అశలు, ఆశయాలకు అనుగూణంగా బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా ప్రభుత్వం తమ పయనాన్ని సాగిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు చెబుతున్నా.. అవన్నీ కేవలం మాటలే తప్ప.. చేతల్లో ప్రభుత్వ పనితీరు మరోలా వుందని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన, పెడుతున్న ప్రతీ పథకం వెనుక ప్రభుత్వ పెద్దలు భారీ అవినీతికి పాల్పడుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టును తన మానస పుత్రికగా చెప్పుకుంటున్న కేసీఆర్, దాని అంచనాలను రూ.30,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో కేసీఆర్ 6 శాతం కమీషన్ దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని రాబందుల్లా దోచుకుని తింటున్నారని దుయ్యబట్టారు. ఉన్న అసెంబ్లీని కూల్చేసి, రూ.500 కోట్లతో కొత్త అసెంబ్లీ కడతామని కేసీఆర్ చెప్పడాన్ని లక్ష్మణ్ తప్పుపట్టారు.
ఈ కొత్త సచివాలయానికి బదులుగా ఆ నిధులను ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి వాడొచ్చు కదా అని సూచించారు. ప్రపంచ గర్వించేలా పారదర్శక పాలనను తెలంగాణలో అందిస్తున్నామని గొప్పలకు పోతున్న ప్రభుత్వం దొంగచాటు చర్యలు కూడా తెరతీస్తుందని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం జారీచేస్తున్న జీవోలను వెబ్ సైట్ లో కనిపించకుండా చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ఇప్పటివరకూ 5 శాఖలకు సంబంధించి 1,400 జీవోలు కనిపించకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.