పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ఎప్పటిలాగే ఆ నోట్లూ పోయాయి. పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. దీంతో ఇంట్లోని పనిమనుషులను విచారించిన పోలీసులు అసలు దొంగను పట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబరు 10లోని సింగాడీ బస్తీలో నివసించే ఉప్పరి అఖిల(20) బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే భీంరెడ్డి పటేల్ ఇంట్లో ఆరు నెలలగా పనిచేస్తోంది. కొద్ది రోజులుగా భీంరెడ్డి ఇంట్లో డబ్బులు పోతున్నాయి. డబ్బు ఎవరు కాజేస్తున్నారో గుర్తించేందుకు యజమాని రూ.2100 గదిలో పెట్టి.. ఆయా నోట్ల నంబర్లను రాసుకున్నాడు. కొద్ది సేపటికే డబ్బులు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యజమాని ఇచ్చిన నోట్ల నంబర్లతో సరిపోలిన నోట్లు అఖిల వద్ద పోలీసులు గుర్తించారు. చివరికి దొంగతనం చేసినట్లు ఆమె అంగీకరించింది. రూ. 16,500 స్వాధీనం చేసుకుని, నిందితురాలిని రిమాండ్ చేసినట్లు బంజారాహిల్స్ డీఐ రవికుమార్ తెలిపారు.