పెట్రోల్ బంకుల్లో మోసాలు సర్వసాధారణమైపోయాయి. లీటరు పెట్రోలుకు కనీసం 100 మిల్లీలీటర్లు తేడా వస్తోంది. దీంతో మన జేబులు గుల్ల. అంతేకాదు... కొన్ని బంకుల్లో కల్తీ కూడా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే... పౌరసరఫరాల శాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ నెల ఒకటి నుంచి 22 వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు, సిబ్బందితోపాటు ఆయిల్ కంపెనీల అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 శాతం(2,553) పెట్రోలు బంకుల్లో తనిఖీలు జరిగాయి. మొత్తంమీద నిబంధనలను ఉల్లంఘిస్తోన్న 183 బంకుల యజమానులకు క్రమశిక్షణా చర్యల కింద నోటీసులు జారీ చేశారు. వీటిలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని 24 బంకులు, కరీంనగర్లో 20, కామారెడ్డిలో 20, సిద్దిపేటలో 14 బంకులున్నాయి.