గణేష్ నవరాత్రోత్సవాల వేళ దేవాదాయ శాఖ హుస్సేన్సాగర్లో గంగా హారతి నిర్వహిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రిషీకేష్.. వారణసీ.. హరిద్వార్ తరహాలో నగరంలోనూ గంగా హారతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గణేష్ నవరాత్రోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై శ్రీనివాసయాదవ్ అధ్యక్షతన హోం మంత్రి మహమూద్అలీ, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్లు వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సచివాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడుతూ హైదరాబాద్లో జరిగే గణేష్ ఉత్సవాలకు దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉంద ని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని పండుగలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందన్నారు. తలసాని మాట్లాడుతూ మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 55 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశముందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఖైరతాబాద్ గణనాథుడి వద్ద 9 రోజులపాటు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. నిమజ్జనం కోసం చెరువులు, కొలనుల వద్ద 225 క్రేన్లు ఏర్పా టు చేస్తున్నామన్నారు. నిమజ్జన ప్రాంతాలు, శోభాయాత్ర మార్గంలో పారిశుధ్య నిర్వహణకు జీహెచ్ఎంసీ 9,710 కార్మికులు, 688మంది జవాన్లతో 180బృందాలను ఏర్పాటు చేస్తుందని, మూడు షిప్టులలో వారు పని చేస్తారన్నారు.