హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు యధాతథంగా కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో, ఉన్న పరిమితుల్లోనే పేద ప్రజల సంక్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని బడ్జెట్ ప్రసంగంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు పథకం కింద రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచాం. ఈ క్రమంలో ఈ పథకం యధాతథంగా కొనసాగుతుంది. రైతుబంధు కోసం ఈ బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదని సీఎం చెప్పారు. అదే విధంగా రైతుబీమా పథకాన్ని కూడా యధాతథంగా కొనసాగిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. రైతుబీమా ప్రీమియం చెల్లించడం కోసం ఈ బడ్జెట్లో రూ. 1,137 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇక ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రైతుల పంటరుణాల మాఫీ కోసం రూ. 6 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. విద్యుత్ సబ్సిడీల కోసం రూ. 8 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.