Nukarapu Surya Prakasa Rao - నూకారపుసూర్యప్రకాష్ రావు
ప్రశ్న : బ్యాంకుల ద్వారా బంగారం కొనచ్చంటూ ఇటీవల కొంత కాలంగా సామాజిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. నిజమేనంటారా? గతంలో బ్యాంకులు బంగారం అమ్మినా, వాటి అమ్మకాలు కాల క్రమంలో లేకుండా పోయాయి. మళ్లీ ఇప్పుడు అమ్మకాలపై వస్తున్న వార్తలు నమ్మచ్చు అంటారా? మీ సలహా ఏంటి?
- పట్నాన రాజశేఖరం, విశాఖపట్నం
జవాబు : బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఆభరణాల కాకుండా గోల్డ్ బాండ్ల వైపు చూడండి. ఇక్కడ అయితే కేవలం ఒక గ్రాము నుంచి కూడా బంగారాన్ని కొనుగోలు చేసే వెసులుబాటు అందుబాటులో ఉంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా సావరిన్ గోల్డ్ బాండ్లను ఎప్పటి నుంచి విక్రయించేది ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధ భాగంలో గోల్డ్ బాండ్లను ఎప్పుడెప్పుడు జారీ చేసే విషయాలను వెల్లడించింది.
సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) ప్రతి నెలా కొనుగోలు చేయవచ్చు. 2019 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. బ్యాంకులు (స్మాల్ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు మినహాయింపు), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆప్ ఇండియా, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో వీటికి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి విడత బాండ్ల జారీ జూన్ 3న, రెండో విడత జూలై 8 నుంచి ఉంటుంది. మూడో విడత జారీ ఆగస్ట్ 5 నుంచి, నాలుగో విడత సబ్స్క్రిప్షన్ సెప్టెంబర్ 9 నుంచి జరుగుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వం 2015 నవంబర్లో సారవిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ను లాంచ్ చేసింది.
ఓ వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము నుంచి గరిష్టంగా 500 గ్రాముల వరకు గోల్డ్ బాండ్స్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఉమ్మడి కుటుంబం గరిష్టంగా 4 కిలోల వరకు, ట్రస్టులు 20 కిలోల వరకు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. గోల్డ్ బాండ్స్పై సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీని ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ఒక్కసారి బాండ్ కొంటే ఎనిమిదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఎనిమిదేళ్ల తర్వాత అప్పుడు ఉన్న బంగారం ధరతో సమానంగా తిరిగి చెల్లిస్తారు.