నల్లగొండ : తెలంగాణలోని కోటి మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ తోబుట్టువుగా, పెద్దన్నగా చంద్రుడికో నూలుపోగు అన్నట్లు చిరుకానుకగా చీరలను ఇస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తున్నానని కేటీఆర్ చెప్పారు. ఈ నెల 28న బతుకమ్మ ప్రారంభమవుతోంది. ఆడబిడ్డలందరూ బతుకును గౌరవించుకునే పండుగ.
పూలతో అద్భుతమైన బతుకమ్మను పేర్చి చేసుకునే అరుదైన పండుగ. ఇలాంటి పండుగకు తెలంగాణలోని కోటి మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ తోబుట్టువుగా, పెద్దన్నగా చంద్రుడికో నూలుపోగు అన్నట్లు చిరుకానుకగా చీరలను అందిస్తున్నాం. నచ్చిన చీరలు తేవడం భర్త వల్ల కానే కాదు. కానీ ప్రతి సంవత్సరం చాలా కష్టపడి నేతన్నలు చాలా చక్కని చీరలు తయారు చేశారు. పెద్ద మొత్తంలో చీరల పంపిణీ కార్యక్రమం సవ్యంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 2001, 2002 సంవత్సరాల సమయంలో పోచంపల్లిలో ఏడు మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. నాటి ఉద్యమనాయకుడు, నేటీ సీఎం కేసీఆర్.. వారికి సహాయం చేయ్యండి.. బతుకు మీద భరోసా కల్పించాలని అడిగితే నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. స్వయనా కేసీఆరే జోలెపట్టుకుని డబ్బులు అడిగి.. ఏడు కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున సహాయం చేశారు. కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో నాడు 8 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు.