హైదరాబాద్: భారీ నీటి సంపులో ప్రమాదవశత్తు పడ్డ ఇద్దరిని సకాలంలో జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్క్యూ బృందాలు చేరుకొని వారిని కాపాడాయి. వివరాల్లోకి వెళితే... గచ్చిబౌలి రాయదుర్గంలోని హనుమాన్ ఆలయం సమీపంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తు భవనంలో ఉన్న నీటి సంపులో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశత్తు పడ్డారని, వారిని కాపాడాలని డయల్ 100కు ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్క్యూ బృందం నేడు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంది. సంపులో సెంట్రింగ్ మెటీరియల్ తొలగింపుకు దిగిన ఇద్దరు నిర్మాణ కార్మికులు ఊపిరి ఆడకపోవడంతో స్పృహ తప్పారు. వీరిని డిజాస్టర్ రెస్క్యూ బృందాలు బయటకు తీసి అపస్మారక స్థితిలో ఉన్న వారికి ప్రథమ చికిత్స అందించి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సంపులోకి దిగినవారిని అఫ్రోజ్ (25), ఇమ్రాన్ (30)గా గుర్తించారు. కాగా ఫిర్యాదు అందిన వెంటనే జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్క్కూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని తక్షణమే స్పందించడం పట్ల స్థానికులు అభినందించారు.