హైదరాబాద్ : ప్రగతి భవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ఇరు రాష్ర్టాలకు చెందిన పలువురు మంత్రులు, నాయకులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో గోదావరి జలాల తరలింపు, విభజన అంశాలు, ఆర్థిక మాంద్యంతో పాటు తాజా రాజకీయాలపై సమాలోచనలు జరపనున్నారు. ఇరు రాష్ర్టాల సీఎంలు కేసీఆర్, జగన్.. ఇప్పటికే పలుమార్లు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
జూన్ 28వ తేదీన ప్రగతిభవన్లో ఇద్దరు సీఎంలు, తమ రాష్ట్రాల అధికారుల బృందంతో కలిసి సమావేశమయ్యారు. ఆగస్టు 1న మరోసారి ఇద్దరు సీఎంలు మాత్రమే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఒడిసి పట్టుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించే ప్రతిపాదన ముందుకొచ్చింది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇద్దరు సీఎంలు అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలపై ఈ భేటీలో ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.