హైదరాబాద్: రాగల మూడ్రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తా తమిళనాడు తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 4.5 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఇది మరింత ఎత్తునకు వెళ్లి నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే మూడ్రోజుల్లో తెలంగాణలోని చాలాచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.