హైదరాబాద్ సోమాజిగూడ మోనప్ప ఐల్యాండ్ వద్ద ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీ కొన్న ఘటనలో గాయపడిన మహిళకు ఓ కానిస్టేబుల్ చేయూతనందించారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయం సమీపంలో జరిగింది. బీఎస్ మక్తాకు చెందిన సుధారాణి (36) ఉపాధ్యాయురాలు. భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై సికింద్రాబాద్ వైపు బయలుదేరింది. సోమాజీగూడ మోనప్ప చౌరస్తాలో యూటర్న్ తీసుకుంటుండగా, వేగంగా వచ్చిన ఆటో వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సుధారాణి కింద పడిపోయింది. తలకు, నడుముకు గాయాలై లేవలేక బాధ పడుతుండగా, పంజాగుట్ట పెట్రోకార్-3లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రభు.. ఆమెను చేతులపై మోసుకువెళ్లాడు. రోడ్డు దాటి అటుగా వెళ్తున్న ఆటోను ఆపి ఆమెను అందులో కూర్చొబెట్టాడు. ఆమెను సమీపంలోని వివేకానంద ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ ప్రభును వాహనదారులు, ప్రయాణికులు అభినందించారు.