రాష్ట్ర ప్రభుత్వానికి పెనాల్టీ పడనుంది. పంటల బీమా అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం వాటా సకాలంలో చెల్లించకపోవడమే ఇందుకు కారణం. 2018-19 ఖరీఫ్, రబీలలో రూ.203 కోట్లు, 2019-20 సంవత్సరానికి రూ.252 కోట్లు తెలంగాణ ప్రభుత్వం తన వాటా కింద పంటల బీమా ప్రీమియం సబ్సిడీని చెల్లించాల్సి ఉంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం అమలులో తీసుకువచ్చిన మార్పుల ప్రకారం ప్రీమియం వాటా సకాలంలో చెల్లించకపోతే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు పెనాల్టీ విధిస్తారు. అదే సమయంలో బీమా కంపెనీలు సరైన సమయానికి రైతులకు పరిహారం చెల్లించకపోయినా పెనాల్టీ వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రూ.457 కోట్లు ప్రీమియం సబ్సిడీని చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే సమయం దాటిపోవడంతో పెనాల్టీ వేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.