తెలంగాణ రాష్ట్రంలో మార్చిలో నిర్వహించనున్న పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను పొడిగించారు. ముందగా ప్రకటించిన ప్రకారం ఫీజు చెల్లించడానికి అక్టోబరు 29 చివరితేదీ కాగా.. నవంబరు 7 వరకు పొడిగించారు. అలాగే అపరాధ రుసుముతో ఫీజు చెల్లింపు గడువును కూడా పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ అక్టోబరు 21న ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా విద్యార్థుల నామినల్ రోల్స్ను ఆన్లైన్ ద్వారా పంపాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.
*ఫీజు వివరాలు ఇలా..:
➦ పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.125 చెల్లించాలి.
➦ మూడు సబ్జెక్టులు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.110 చెల్లిస్తే సరిపోతుంది. మూడుకంటే ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు మాత్రమే రూ.125 చెల్లించాల్సి ఉంటుంది.
*అపరాధ రుసుముతో అవకాశం..:
విద్యార్థులు ఆలస్య రుసుముతో కూడా ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. రూ.50 అపరాధ రుసుముతో నవంబరు 23 వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబరు 9 వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 23 వరకు అవకాశం కల్పించారు.
*ఫీజు నుంచి వీరికి మినహాయింపు..:
పదోతరగతి పరీక్ష ఫీజు నుంచి నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారికి మినహాయింపు కల్పించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో రూ.24,000 లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20,000 లోపు కుటుంబ వార్షికాదాయం ఉన్న విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇందుకు గాను.. ఆయా విద్యార్థులు కుటుంబ వార్షికాదాయానికి సంబంధించి ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income certificate) సమర్పించాల్సి ఉంటుంది.