తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె తో జనం గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకూడదని నిర్నయించుకున్నట్టే కనిపిస్తోంది. చర్చలు జరపాలని, సెప్టెంబర్ నెల జీతాలు సోమవారంలోగా చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఆదిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయని ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు దాఖలు చేసిన నివేదికలో ఆర్టీసీ నష్టాలలో ఉందని, ఆర్టీసీలో జీతాలు చెల్లించేందుకు నిధులు లేవని తేల్చి చెప్పింది. ఈమేరకు ప్రభుత్వం తరపు న్యాయవాది కేసు విచారణలో పాల్గొని నివేదిస్తూ,ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుకు 224 కోట్లు కావాలని ప్రస్తుతం ఆర్టీసీ కార్పోరేషన్లో కేవలం 7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధం అని వాదించారు. ఇది అక్కడే ఉన్న ఆర్టీసీ కార్మికులను షాక్ కు గురి చేసింది.
కాగా మరోవైపు సమ్మెను ఉదృతం చేసే దిశగా ఆర్టీసి జేఏసి నిర్ణయానికి వివిధ రాజకీయ పార్టీలు, టీఎన్జీవోలు, విద్యార్థి, ప్రజా సంఘాలు, మద్దతు తెలుపుతున్నాయి. సొమవారం నిర్వహించిన ప్రగతి భవన్ ముట్టడికి భయపడి నేతలని ఎక్కడికక్కడ అరెస్టులు చేసిందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి..ఇక 30వ తేదీన 5 లక్షల మందితో ఉస్మానియా యూనివర్సిటీలో సకల జనుల సమర భేరి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని ఆర్టీసీ కార్మికులు చెపుతున్నారు.