తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె విషయంలో తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్. సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్... ఇందుకోసం పలు రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని డిసైడయ్యారు. ఈ మేరకు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... 11న వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే రూట్ల ప్రైవేటీకరణపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అమలవుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఏపీఎస్ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని కేంద్రం తెలంగాణ హైకోర్టుకు చెప్పడంతో... ఈ అంశంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అమలుకావడంపై సస్పెన్స్ నెలకొంది. దీనిపై కేసీఆర్ సైతం తన సమీక్షలో స్పందించినట్టు తెలుస్తోంది. కేంద్రం వాదనపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఏపీ విభజన చట్టంలో చట్టంలోని 9వ షెడ్యూలు కింద ఉన్న ఏపీఎస్ఆర్టీసీని విభజించుకున్నామని, ప్రస్తుతం టీఎ్సఆర్టీసీ ఉనికిలోనే ఉందని సీఎం కేసీఆర్కు అధికారులు వివరించారు. రోడ్డు రవాణా చట్టం-1950లోని సెక్షన్ 3 ప్రకారమే టీఎ్సఆర్టీసీని ఏర్పాటు చేసుకున్నామని, దీనికి ఎలాంటి ఆటంకాలూ లేవని స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కోర్టు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ శుక్రవారం మరోమారు సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేసీఆర్ అధికారులకు వివరించారు. దీనిపై కోర్టు అభ్యంతరం చెప్పడం ఏమిటంటూ ఆయన అధికారుల దగ్గర వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇందుకు ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులు ఏమిటంటూ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ను సీఎం ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ విభజన, ఆస్తులు, ఉద్యోగుల పంపకం వంటి పూర్తి సమాచారాన్ని సిద్ధంగా పెట్టుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.