సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిఎం కేసీఆర్ వైఖరిని తప్పు పడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవన్నారు కేసీఆర్ కానీ ఇప్పుడు రాష్ట్రంలో రైతులు, ఆర్టీసీ కార్మికులు వరుసగా ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. ఇవాళ్ళ మహబూబాబాద్ డిపోకూ చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఆవుల నరేశ్ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇంతమంది కార్మికులు చనిపోతున్నా సిఎం కేసీఆర్ పట్టనట్లు వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం. ఉద్యమాలతో సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలకు విలువ లేకుండా పోయింది.
ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల కోసం 40 రోజులుగా ప్రభుత్వంతో పోరాడుతుంటే ఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు స్వామిగౌడ్ , మమత, రవీందర్, దేవీప్రసాద్ వారికి మద్దతు ఈయకుండా సిఎం కేసీఆర్కు చెంచాగిరీ చేస్తున్నారు. ఆర్టీసీ చరిత్రలో మొదటిసారిగా 40 రోజులుగా సమ్మె జరుగుతోంది. ఇంకా ఎన్ని రోజులు సాగుతుందో తెలియదు కానీ ఇది ఒక బలవంతుడికి బలహీనులైన ఆర్టీసీ కార్మికులకు మద్య జరుగుతున్న పోరాటం. దీనిలో చివరికి ఎవరు గెలుస్తారో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది,” అని అన్నారు.