ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పై అనుమానాలు కలుగుతున్నాయని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి అన్నారు. పిటిషన్ లో విపక్షాలు కార్మిక సంఘాల నేతలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నాయని అందులో ఆరోపించడం విడ్డూరంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పక్కన ఉన్నవారే కుట్రలు చేస్తుంటే ఆ విషయం బయటపెట్టలేక, విపక్షాల మీదకు ఆ నెపాన్ని నెట్టివేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కు చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వాళ్లు కేసీఆర్ పై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరతారని లక్ష్మణ్ ప్రకటించిన నేపథ్యంలో, నేరుగా బీజేపీ పేరును ప్రస్తావించే ధైర్యం లేక, విపక్షాలు కుట్రకు పాల్పడుతున్నాయంటూ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. కుట్ర జరుగుతోందన్నప్పుడు ఆ కుట్రకు పాల్పడుతోంది ఎవరో ఎందుకు బయటపెట్టడంలేదని విజయశాంతి ప్రశ్నించారు.