ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని హైకోర్టుకు అఫిడవిట్ ఇవ్వడాన్ని ఆమె ఖండించారు. ఇందుకు సంబంధించిన తన ఫేస్బుక్ పేజీలో ఆమె ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన పిటీషన్లో, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు, కార్మిక సంఘాల నేతలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడం విడ్డూరంగా ఉందని విజయశాంతి వ్యాఖ్యానించారు.
ఏ కుట్రలు జరగకుండానే, తెలంగాణలో ప్రతిపక్షాన్ని లేకుండా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని విమర్శించారు. ప్రతిపక్ష కాంగ్రెస్కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేకుండా కుట్ర చేసింది కేసీఆరే అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆరోపించారు. మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించి, విలువలకు తిలోదకాలిచ్చింది కూడా కేసీఆరే అని విజయశాంతి విమర్శించారు.