ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం...దీక్ష విరమణ, సడక్ బంద్ వాయిదా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 18, 2019, 08:37 PM

ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం తలపెట్టిన సడక్ బంద్, రాస్తోరోకో కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. ప్రభుత్వంలో చర్చలు జరిపే దిశగా సుహృద్భావ వాతావరణం ఏర్పరచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిరశన దీక్ష విరమణ అనంతరం అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెపై మంగళవారం సాయంత్రం తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఉస్మానియా ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థామ, రాజిరెడ్డితో అఖిలపక్ష నేతలు సోమవారం రాత్రి దీక్ష విరమింపజేశారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వారికి నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్మిక సంఘాల నేతలిద్దరికీ డయాబెటిక్ సమస్య ఉందని.. ఆహారం తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు చెప్పిన నేపథ్యం లో దీక్ష విరమించాలని కోరినట్లు కోదండరామ్ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ చర్చల కోసం మంచి వాతావరణం కల్పించాలనే ఆలోచనతోనే దీక్ష విరమింపజేసినట్లు కోదండరామ్ చెప్పారు. కార్మిక నేతలు దీక్ష విరమించినా.. సమ్మె కొనసాగుతుందని తెలిపారు. కార్మిక నాయకులు, విపక్ష నేతలు అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు తేల్చి చెప్పిందని అశ్వత్థామ రెడ్డి అన్నారు. లేబర్ కోర్టుకు రెఫర్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చిందని చెప్పారు. కార్మికులు విధులకు హాజరైతే.. చక్కని వాతావరణం ఉండాలని న్యాయస్థానం ఆదేశించిందని తెలిపారు. కోర్టు తీర్పును గౌరవించి.. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంతో సంబంధాలను పునరుద్ధరించడానికి, సుహృద్భావ వాతావరణంలో సమస్య పరిష్కరించుకోవడానికి సడక్ బంద్ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం తీర్పు కాపీ అందిన తర్వాత అందరితో చర్చించి సమ్మెపై తుది నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, కో-కన్వీనర్ రాజిరెడ్డి గత మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. శనివారం తన నివాసంలో దీక్ష ప్రారంభించిన ఆశ్వత్థామ రెడ్డిని పోలీసులు ఆదివారం బలవంతంగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీక్ష విరమించాలని పోలీసులు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన వినకుండా అలాగే కొనసాగించారు. వైద్యులు ఆయనకు గ్లూకోజ్, ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఆహారం తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదం అని హెచ్చరించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com