హైదరాబాద్.. భిన్న సంస్కృతులకు కేరాఫ్ అడ్రస్.. అంతేకాదు.. ఇక్కడ ఉన్న చారిత్రక కట్టడాలు చూస్తే.. వావ్ అనాల్సిందే. హైదరాబాద్ నగరం పేరు చెప్తే చాలు.. అందరికీ గుర్తొచ్చేది.. చార్మినార్, ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, గోల్కొండ.. ఎందుకంటే నగరానికి వచ్చిన ఎవరైనా సరే.. వీటిని చూడాల్సిన ప్రదేశాలు. అయితే తాజాగా ఇప్పుడు వీటి సరసన మరో కట్టడం కూడా చేరబోయేందుకు సిద్ధమైంది. అదే దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రోప్ బ్రిడ్జ్.
దుర్గం చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా.. ఈ రోప్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో దుర్గం చెరువుకు పర్యాటక శోభ తెచ్చేలా కృషిచేస్తున్నారు. ఇప్పటికే వీటి పనులు చివరి దశకు చేరుకున్నాయి. సింగిల్ పోల్ సపోర్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా చకచకా సాగుతున్నాయి. బలమైన రోప్లతో ఈ చెరువుపై పనులు చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించిన ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. అత్యద్భుతంగా నిర్మిస్తున్నఈ బ్రిడ్జ్ ఫొటోలు.. వీక్షించేందుకు ఆకట్టుకుంటున్నాయి.