ఆర్టీసీ కార్మికులు ఆత్మత్యాగాలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమని కాంగ్రెస్ నాయకురాలు, మాజీమంత్రి గీతారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో... దీనిపై జోక్యం చేసుకోవాలని గీతారెడ్డి సహా ఇతర పార్టీల నాయకులు గవర్నర్ తమిళిసైను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని ఆమె విమర్శించారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి విపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఐఏఎస్ అధికారి కోర్టుకు అఫడవిట్ ఇవ్వడాన్ని గీతారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.
దీనిపై గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆమెను కోరినట్టు వివరించారు. దీనిపై కేంద్రంతో పాటు రాష్ట్రపతిని కూడా కలవాలని అఖిలపక్షం నేతలు నిర్ణయించినట్టు గీతారెడ్డి తెలిపారు.